ముంబై : గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు నిశికాంత్ కామత్ (50) నేటి సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
జ్వరం, ఆయాసంతో జులై 31న నిశికాంత్ గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. గత రెండేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స తర్వాత కొంత కోలుకున్నట్టు కనిపించారు. అయితే, ఆ తర్వాత మళ్లీ ఆయన పరిస్థితి
విషమించినట్టు ఏఐజీ హాస్పిటల్స్ పేర్కొంది.
వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, అయినప్పటికీ రోజురోజుకి ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని వివరించింది. నిన్నటి నుంచి ఆయన శ్వాసకోశ పనిచేయడం మానేసిందని, రక్తపోటు కూడా బాగా తగ్గిపోయిందని పేర్కొంది. కాపాడటానికి తాము అన్నివిధాలుగా ప్రయత్నించామని, అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
నిశికాంత్ మరణంపై నటుడు రితీష్ దేశ్ముఖ్ స్పందించారు. ‘నేను నిన్ను మిస్ అవుతాను మై ఫ్రెండ్. నీ ఆత్మకు శాంతి
చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఇక నిషికాంత్ కామత్ 2004 లో వచ్చిన ‘హవా అనీ డే’ అనే
చిత్రంతో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు.
అనంతరం డైరెక్షన్పై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా అవతారమెత్తారు. అతను క్రమంగా దర్శకత్వం వైపు వెళ్లారు. హిందీలో దృశ్యం, మదారి, ముంబై మేరీ జాన్ లాంటి సినిమాలతో నిశికాంత్ మంచి పేరు సంపాదించుకున్నారు.