రొటీన్ మూస చిత్రాలకు పెద్ద రిలీఫ్… ‘ఎవరు’ మూవీ రివ్యూ…

- Advertisement -

‘ఎవరు’ అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘ఎవరు’. కంటెంట్ ఉన్న కథలో ట్విస్ట్‌లు ఉంటే సినిమా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. కాని సీన్‌ సీన్‌కి ట్విస్ట్ ఉండి.. ఆ ట్విస్ట్ కన్వెన్సింగ్‌‌గా ఉంటే అందులో ఉండే మజానే వేరు.

‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో… అడివి శేష్ సినిమాలంటే ఏదో విషయం ఉంటుందబ్బ.. అనే పాజిటివ్ వైబ్రేషన్స్‌ ఆడియన్స్‌లో ఉండనే ఉంది. ఇక ‘ఎవరు’ టీజర్, ట్రైలర్‌లతో ఇదేదో చూడాల్సిన సినిమాలానే ఉందనిపించిన అడివి శేష్ మరోసారి ప్రశంసలకు అర్హుడయ్యాడు.

సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప.. ప్రీమియర్ షోలు వేయరు. కాని ‘ఎవరు’ చిత్రం విడుదలకు ముందే వేయి మందికిపైగా జనరల్ ఆడియన్స్‌కి చూపించి మరీ సినిమా విడుదల చేశారంటే ‘ఎవరు’ దమ్మున్న కథే అని ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ఈ అంచనాల్ని నిజం చేసింది ‘ఎవరు’.

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు.. వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే.

‘ఎవరు’ చిత్రంతో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్ రామ్ జీ. ప్రశ్నల వెనుక నిజాన్ని రాబట్టే విధానానికి సలామ్ కొట్టాల్సిందే. ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఎన్నో చిక్కుముడులు.. ఈ చిక్కుముడి విప్పే ప్రయత్నంలో మరో మలుపు.

ఆ మలుపు వెనుక దాగి ఉన్న అసలు మర్మం. మొత్తానికి స్పానిష్ సినిమా కథను రిమేక్ చేసినా అందులోని ఒరిజినల్ ఫ్లేవర్‌ని పోగొట్టకుండా కథను మాంఛి రసపట్టుగా నడిపించాడు.

‘ఎవరు’ సినిమా ప్రశ్నలతోనే మొదలౌతోంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ‘ఎవరు’ కథను మలిచారు.

క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్‌గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి కథ కొసరంతే ఉన్నా.. కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంటాయి. ఈ ‘ఎవరు’ కథ కూడా ఈ కోవలోనిదే. కథ మొత్తం స్క్రీన్ ప్లే మాయాజాలంతో సాగుతుంది.

ఇదీ కథ…

ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే.. ఓ సాప్ట్‌వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్‌కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది.

ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడం.. అక్కడే అశోక్ హత్య చేయబడటం జరుగుతుంది. ఈ హత్య, అత్యాచారం ఎలా జరిగింది? ఎవరు చేశారన్నదే కథలో ట్విస్ట్.

మరోవైపు కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతాడు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్).

డబ్బు ఇస్తే ఎలాంటి పనినైనే చేసే పెద్ద లంచావతారం విక్రమ్ వాసుదేవ్.. వినయ్ వర్మ కేసును డీల్ చేయడానికి రాహుల్ దగ్గర లంచం తీసుకుంటాడు. ఈ కేసుకి సమీరా కేసుకి లింకేంటి? అసలు విక్రమ్ వాసుదేవ్ ‘ఎవరు’? వినయ్ వర్మ ‘ఎవరు’? రాహుల్ ‘ఎవరు’? సమీరాని రేప్ చేసింది ‘ఎవరు’? అశోక్‌ని హత్య చేసింది ‘ఎవరు’? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఎవరు’? చిత్రం.

భిన్నమైన హీరో క్యారెక్టరైజేషన్…

రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌కి బిల్డప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే అడివి శేష్ చిత్రాల్లో అతని క్యారెక్టరైజేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి అనవసరమైన హంగామా చేయకుండా సింపుల్‌గా కథలోకి ఎంటర్ అయిపోతుంటాడు.

ఫైట్లు, ఫీట్లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలను టచ్ చేయకుండానే ఈ సినిమాలో హీరోయిజం పండించాడు. కరెప్టడ్ ఎస్ఐ‌గా అదరగొట్టాడు. అడివి శేష్‌లోని నటుడు మాత్రమే కాకుండా అతనిలోని రైటర్‌ ‘ఎవరు’ కథకు బాగా హెల్ప్ అయ్యింది.

రొటీన్‌కి భిన్నంగా హీరోయిన్ క్యారెక్టర్…

ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా నటించినా.. ఆమె సినిమాకి మాత్రమే హీరోయిన్. కథలో హీరోకి హీరోయిన్ లేదంటే కథపై దర్శకుడికి ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య పాటలు, రొమాంటిక్ సీన్లు, ముద్దు, ముచ్చట్లు అంటూ రన్ టైం గడిపేయకుండా మిస్టరీని మెయింటైన్‌ చేస్తూ కథను నడిపించారు.

మంచి పాత్ర పడాలే కాని.. తనలోనూ పూర్తి స్థాయి నటి ఉందని సమీరా పాత్రతో నిరూపించుకుంది రెజీనా. తొలి సీన్‌లోనే తన పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన రెజీనా.. ఆ ఫ్లో మిస్ కాకుండా సినిమా చివరి వరకూ కంటిన్యూ చేసింది.

డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కవ్వించింది.. ఏడిపించింది.. నవ రసాలను పండించింది. వాస్తవానికి ఈ కథలో హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు అరుదుగా వస్తున్న తరుణంలో ఓ ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసింది రెజీనా.

సమస్యను మూడు కోణాల్లో…

ఈ చిత్రంలో కీలకమైన రెజీనా రేప్ సీన్‌ను మూడు కోణాల్లో చూపించాడు దర్శకుడు. ఒక్కోసారి ఒక్కో ప్రశ్నకు చిక్కుముడి వీడుతుంది. ఈ మూడు సీన్స్‌కి భిన్నమైన నేపథ్యం ఉంటుంది. కథ డిమాండ్ చేయడంతో దర్శకుడు రెజీనాలోని గ్లామర్‌ యాంగిల్‌ని కూడా ఉపయోగించుకున్నాడు.

నవీన్ చంద్రతో రొమాన్స్, లిప్ లాక్స్ హద్దులు మీరినట్టుగా అనిపించినా కథకు బలాన్నిచ్చేవిగా మలిచారు. నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. రెజీనాతో రొమాంటిక్ సన్నివేశాల్లో తనలోని రొమాంటిక్ నటుడ్ని మేల్కొలిపాడు.

‘జగడం’ సినిమాలో రామ్ తమ్ముడిగా నటించిన నిహాల్ ఈ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‌గా అద్భుతంగా నటించాడు. కథలో కీలకమైన రోల్ పోషించారు. ఎమోషనల్ సన్నివేశాలను చాలా ఈజీగా క్యారీ చేసి కంటతడి పెట్టించాడు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఈ పాత్రకు హైప్ వచ్చింది.

ఇక కథలో కీలకమైన వినయ్ వర్మ పాత్రలో మురళీశర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆయనకు భార్యగా నటించిన పవిత్ర లోకేష్ తన పరిధిమేర పాత్రకు న్యాయం చేసింది.

టెక్నికల్‌గా చూస్తే…

అబ్బూరి రవి అందించిన సంభాషణలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. కథలో లీనం అయ్యేలా అతని మాటలు బలాన్నిచ్చాయి. ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథకు ఎలాంటి ఇంటెన్సిటీ ఉండాలో తన కెమెరా పనితనంతో చూపించాడు వ‌ంశీ ప‌చ్చిపులుసు. సినిమా మొత్తంలో ఐదారు లొకేషన్ల కంటే ఎక్కువగా కనిపించవు.

కథ మొత్తం హీరో ఒక రూంలో కూర్చుని నెరేట్ చేస్తున్నా.. లొకేషన్స్ బోర్ అనిపించకుండా ఇంటర్నేషనల్ అపీరెన్స్ తీసుకువచ్చాడు. గ్రాఫిక్స్ హంగామా లాంటివి పెద్దగా ఉండవు కాబట్టి సినిమా మొత్తం రియిలిస్టిక్ లుక్ తీసుకువచ్చారు.

‘గూఢచారి’ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించిన శ్రీ చరణ్ పాకాల మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు తాను బెస్ట్ చాయిస్ అనిపించాడు. సాంగ్స్ కూడా కథలో భాగమయ్యాయి. ఎడిటర్ గ్యారీ అక్కర్లేని సీన్లకు కత్తెరేసి క్రిస్పీగా ఎడిట్ చేశాడు. రన్ టైం కూడా చాలా తక్కువ కావడంతో సినిమా మంచి రేసీ‌గా అనిపించింది.

హిట్ ఫ్లేవర్‌ని ముందే పసిగట్టిన నిర్మాత…

ఇక వరుసగా ఐదోసారి అడివి శేష్‌తో సినిమా చేసిన నిర్మాత పీవీపీ మరోసారి ఎమ్‌వీపీ (మోస్ట్ వాల్యుబుల్ ప్లే) అనిపించారు. కథను నమ్మి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి అందులోని హిట్ ఫ్లేవర్‌ని ముందే పసిగట్టారు.

ఇక ప్రతి సినిమా మాదిరి ఇందులోనూ రంధ్రాన్వేషణ చేస్తే.. ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్‌‌ సీన్‌‌తో కథ రసకందాయంలో పడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి.

కామెడీ, మసాలాలు లేకపోవడం లోటే కాని.. బీ, సీ సెంటర్లలలో ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే అవి తప్పనిసరే. ఇక మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సీరియస్ కథను ఆస్వాదిస్తారు కాని.. మరీ ఇంత సీరియస్ స్క్రీన్ ప్లేని మాస్ ఆడియన్స్ సీన్ టు సీన్ ఫాలో కావడం ఆ లాజిక్‌లు, మ్యాజిక్‌లను ఎక్కించుకోవడం కాస్త కష్టమే.

ఫైనల్ థాట్…

అయితే రొటీన్ మూస చిత్రాలకు పెద్ద రిలీఫ్ ఈ ‘ఎవరు’ అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

తారాగణం…

న‌టీన‌టులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప‌చ్చిపులుసు
సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌
క‌ళ‌: అవినాష్ కొల్ల‌
కూర్పు: గ్యారీ బి.హెచ్‌
సంభాష‌ణ‌లు: అబ్బూరి ర‌వి
నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రాంజీ
సంస్థ‌: పీవీపీ సినిమా

- Advertisement -

1 COMMENT

Comments are closed.