లండన్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడిని పాకిస్థాన్ యువకుడు దారుణంగా హతమార్చాడు. లండన్లో జరిగిందీ ఘటన. హైదరాబాద్ పాతబస్తీలోని నూర్ఖాన్ బజార్కు చెందిన నదీముద్దీన్ హమీద్ మొహమ్మద్ (24), పాకిస్తాన్కి చెందిన పెర్విజ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ క్రమంలో నదీమ్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానించాడు. అది కాస్తా పెనుభూతంగా మారడంతో కత్తితో పొడిచి నదీమ్ను దారుణంగా హత్యచేశాడు. తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని భార్య మొత్తుకున్నా వినని పెర్విజ్ అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై నదీమ్ను దారుణంగా చంపేశాడు.
తాజాగా, ఈ కేసులో లండన్ న్యాయస్థానం పెర్విజ్ను దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు 22 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.
దీంతోపాటు పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు గాను మరో 18 నెలల జైలు శిక్ష విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు దీనిని కూడా అనుభవించాలని స్పష్టం చేసింది. కాగా, నదీమ్ హత్య నాటికి అతడి భార్య అఫ్సా 8 నెలల గర్భవతి.