హైదరాబాద్: ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.. చివరిదాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’ అంటూ టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
బుధవారం ఆయన తన 37వ జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: మంచి కథ, స్క్రిప్ట్ సిద్ధమైతే.. మళ్లీ ‘పైసా వసూల్’! బాలయ్య-పూరి కాంబినేషన్పై ఛార్మి కామెంట్స్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ తదితరులు ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
బుధవారం దేశవ్యాప్తంగా ట్విట్టర్లో #HappyBirthdayTarak అనే ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ ట్యాగ్ను ఉపయోగించి 3 లక్షల మందికిపైగా ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా తారక్ కూడా భావోద్వేగంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
‘‘మీరు నా మీద చూపిస్తోన్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండడం తప్ప..’’ అంటూ ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.
ట్వీట్లన్నీ చదివానని, తన జన్మదినాన్ని ప్రత్యేకం చేశారని పేర్కొంటూ.. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తోటి నటీనటులకు, అభిమానులకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life ??
— Jr NTR (@tarak9999) May 20, 2020