మరో సంచలన సినిమా ప్రకటించిన రాంగోపాల్ వర్మ

- Advertisement -

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ఘటనపై సంచలన దర్శకుడు‌ రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్టు ట్విటర్‌లో ప్రకటించాడు.

‘మర్డర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు ‘కుటుంబ కథా చిత్రమ్‌’ అనేది ఉప శీర్షిక. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు తన కుమార్తె అమృత.. ప్రణయ్‌ అనే యువకుడిని కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

వాస్తవ ఘటనల ఆధారంగా ఆర్జీవీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాడు. ప్రేమ-పగ మధ్య జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రణయ్‌-అమృత ప్రేమ వివాహం, ప్రణయ్‌ హత్యకేసు, మారుతీరావు ఆత్మహత్య తదితర అంశాలపై చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నాడు.

రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మారుతీరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు.
రాంగోపాల్ వర్మ, టాలీవుడ్, మర్డర్, మారుతీరావు, ప్రణయ్, అమృత

- Advertisement -