షాకింగ్: భర్తపై కోపంతో తన ఇంట్లోనే చోరీ చేయించిన భార్య, పోలీసులు కనిపెట్టేయడంతో మళ్లీ నాటకం…

wife robbery money in Own house for Anger on her husband in hyderabad
- Advertisement -

 

wife-robbery-money-in-Own-house-for-Anger-on-her-husband-in-hyderabad

రాంగోపాల్‌పేట్‌: భర్తపై కోపంతో ఓ మహిళ తన సొంత ఇంట్లోనే దొంగతనం చేయించిన సంఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గురువారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్, డీఐ వెంకటేశంలతో కలిసి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… రెజిమెంటల్‌బజార్‌కు చెందిన వేణుగోపాల్, సాయి కుమారి అలియాస్‌ సునీత భార్యాభర్తలు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నెల  4న వారి మధ్య మళ్ళీ గొడవ జరగడంతో..  సునీత తన ముగ్గురు పిల్లలను తీసుకుని మల్కాజ్‌గిరిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.  7వ తేదీన వేణుగోపాల్‌ భార్య వద్దకు వెళ్లి, మాట్లాడి తుకారాంగేట్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లిపోయాడు.

నవంబర్ 9వ తేదీ ఉదయం రెజిమెంటల్‌బజార్‌లోని వేణుగోపాల్ పక్కింటివారు అతడికి ఫోన్‌ చేసి వారి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పడంతో ఆయన ఇంటికి వచ్చి చూసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ దొంగతనం చేసింది వారికి బాగా తెలిసినవారే అని గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

అంతా భార్య డైరెక్షన్‌లోనే…

వేణుగోపాల్‌ తరచూ తాగి ఇంటికి వస్తుండటంతో పాటు మరికొన్ని విషయాల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆమె తన సమీప బంధువులు సాయి కుమార్, శివతో కలిసి ఈ దొంగతనానికి పథకం పన్నింది. ఇందులో భాగంగా శివకు ఇంట్లోని నగదు,  వాటిని దాచిన వివరాలు చెప్పింది.

అయితే ఆ సమయంలో సాయికుమార్‌ మల్కాజ్‌గిరిలో సునీతతో పాటే ఉన్నాడు. ఈ నెల 8న సాయంత్రం శివ వారి ఇంటి తాళాలు పగులగొట్టి  నగదు, బంగారాన్ని తీసుకెళ్లాడు. కొద్ది రోజుల పాటు వాటిని తమ వద్దే ఉంచుకుని భర్తను ఇబ్బంది పెట్టాలని సునీత భావించింది.

మర్నాడు.. దొంగతనం జరిగిందనే సమాచారం అందడంతో వేణుగోపాల్‌తో పాటు అక్కడికి వెళ్లిన సునీత కూడా స్పృహ తప్పినట్లు నాటకం అడి.. తనపై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో భయాందోళనకు గురైన సునీత, సాయి, శివ 10 వ తేదిన రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్ద కలుసుకున్నారు.

డబ్బు, నగదు వారికి అందించి శివ వెళ్లిపోగా సాయి, సునీత రైల్లో పూణే వెళ్లిపోయారు. గురువారం ఉదయం నగరానికి తిరిగి వచ్చిన వీరు రేతిఫైల్‌ బస్టాండ్‌  సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో గోపాలపురం క్రైమ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు పట్టుబడిన తర్వాత కూడా సునీత.. తన ఇంట్లో జరిగిన చోరీతో తనకేం సంబంధం లేదని.. దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించి అతడు రైల్లో వెళ్తుంటే పూణే దాకా వెంబడించి పట్టుకుని డబ్బు తీసుకుని వచ్చానని  నమ్మించేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారించారు.

చివరికి అసలు విషయం బయటికొచ్చింది.. దీంతో పోలీసులు సాయి, సునీతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా శివ పరారీలో ఉన్నాడు.  అతడి కోసం వారు గాలిస్తున్నారు.

చోరీ సొమ్ములో రూ 1.20 నొక్కేసిన శివ..

చోరీకి పాల్పడిన శివ నగదు, బంగారాన్ని ఆ రోజంతా తన వద్దే ఉంచుకుని మరుసటి రోజు సాయి, సునీతలకు అప్పగించాడు. ఇంట్లో దొరికిన డబ్బంతా ఇచ్చేసినట్లు చెప్పాడేకానీ.. అందులోంచి శివ రూ.1.20 లక్షలు నొక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -