మరో గంటలో చంద్రబాబు ‘ఇసుక దీక్ష’ ప్రారంభం

- Advertisement -

విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 8 గంటలకు ‘ఇసుక దీక్ష’ ప్రారంభించనున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నాచౌక్‌లో ప్రారంభం కానున్న చంద్రబాబు నిరాహార దీక్ష రాత్రి ఎనిమిది గంటలకు ముగియనుంది.

ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున పరిహారంగా ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌తో చంద్రబాబు ఈ దీక్షకు దిగారు.

దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలతోపాటు, 125 వృత్తులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులను దీక్షకు ఆహ్వానించారు. ఇసుక కొరతతో నష్టపోయిన వ్యాపార రంగాల ప్రతినిధులనూ పార్టీ ఆహ్వానించింది.

సంఘీభావం తెలపాలంటూ బీజేపీ, వామపక్షాలు, ఇతర పార్టీ నేతలను టీడీపీ ఆహ్వానించింది. వామపక్ష పార్టీలు తాము పాల్గొనలేమని చెప్పేశాయి. బుధవారం టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పార్టీ నేత నరేంద్ర విజయవాడ పటమటలంకలోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లారు.

అరగంటకుపైగా ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీక్షా శిబిరానికి రావాలని ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

- Advertisement -