అమరావతి: ఎప్పుడూ సంచలన కామెంట్లు చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఎవరు ఏమడిగినా ఫలితాలు వచ్చాక చూద్దామనే అన్నారు తప్ప సంప్రదింపులు, పొత్తుల వంటి అంశాలపై ఆయన ఏదీ మాట్లాడలేదు.
అలాంటిది ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు.. బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ప్రకటించారు.
చదవండి: ‘‘బాబు లోకేష్ , ఏబీ వెంకటేశ్వరరావుని తప్ప ఇంకెవరిని నమ్మరు!’’
ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.. రెండు కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జనసేన పూర్తి మెజార్టీ సాధించుకొని అధికారంలోకి వస్తుందన్నది మొదటి పాయింట్. ఇది దాదాపు అసాధ్యం అని జనసేనలోని నేతలకూ తెలుసు.
అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అర్థం అది కాకపోవచ్చు. రెండో పాయింట్ చూస్తే… మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీతో జట్టు కట్టి అధికారంలో భాగస్వామ్యం అవుతారన్నది కావచ్చు. ఇది కొంచెం ఆయన గతంలో చెప్పిన మాటలకు దగ్గరగా ఉంది.
ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో తక్కువ స్థానాలు సాధించిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలిగినప్పుడు తామెందుకు ఏర్పాటు చెయ్యలేమని అన్నారు.
చదవండి: ఫలితాల టెన్షన్: దేవినేని ఉమా, కేశినేని నాని బీపీ నార్మల్…!
అదే పరిస్థితి వస్తే, ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ను మద్దతు కోరితే, ఆయన ప్రభుత్వానికి సపోర్టుగా మద్దతు ఇస్తారా లేక, కర్ణాటకలోలాగా ఆయనే ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వమంటారా అన్నది మరో చర్చనీయ కోణం.
ఇప్పటికైతే… పదవులపై ఆశలు పెట్టుకోని పవన్ కళ్యాణ్… ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. ఇలా జరగాలంటే… ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి మ్యాజిక్ మార్క్ స్థానాలు రాకూడదు. అదే సమయంలో ఆ పార్టీ జనసేన మద్దతు కోరాల్సి ఉంటుంది.
ఈ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొనే పవన్.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కామెంట్లు చేశారని తెలుస్తోంది. చాలా సర్వేల్లో జనసేన ప్రభావం ఉండదని వచ్చినా, కొన్ని సర్వేల్లో మాత్రం జనసేన ప్రభావం కూడా ఉంటుందని వచ్చింది.
అందువల్ల అదే పాజిటివ్ ఫీలింగ్తో తమ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం చెబుతున్నారు పవన్ కళ్యాణ్. మరి రిజల్ట్ ఏంటో గురువారం ఎలాగూ తెలుస్తుంది. హంగ్ ఏర్పడే పరిస్థితే వస్తే… కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయని అనుకోవచ్చు.