హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రూ.1000 కోట్లు ఖర్చుపెట్టైనా సరే.. కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మహాకూటమికి, టీఆర్ఎస్కు మధ్య జరుగుతున్న ఎన్నికల పోరు.. కురుక్షేత్రం లాంటిదని రేవంత్ అభివర్ణించారు. మహాభారత యుద్ధంలో కౌరవులు వంద మంది ఉన్నా పంచ పాండవుల చేతిలో ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తానని చెబుతున్న కేసీఆర్ కౌరవ వంశానికి చెందిన వారని, తన నియోజకవర్గం కొడంగల్లో ఉన్న ఐదు మండలాలు పంచ పాండవులని చెప్పారు.
కౌరవుల మాదిరిగానే కేసీఆర్ దురాగతాలు ఉన్నాయని, కొడంగల్ నియోజకవర్గంలో జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కోట్లాది రూపాయలు వెదజల్లి, వందలాది ముఠాలను రంగంలోకి దించి ఎలాగైనా గెలుపు సొంతం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని, ప్రజలు కూడా ఇక్కడ ఏం జరుగుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రేవంత్ చెప్పారు.