అమరావతి: ఎన్నడూ లేని విధంగా పోలింగ్కీ, ఫలితాలకూ దాదాపు నెలన్నర గ్యాప్ రావడంతో.. ఏపీలో రాజకీయం ఉడుకెత్తి పోతోంది. మొదటి పది రోజులూ సొంత సర్వేల మీద నడిపించిన పార్టీల నేతలు, తర్వాతి పదిరోజులూ విహారయాత్రలకు కేటాయించారు. ఇప్పుడు బెట్టింగ్ల గురించి అధికారిక చర్చే జరిగిపోతోంది.
వైసీపీ వాళ్ళు బెట్టింగ్లతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరెవరూ పడిపోవద్దు’ అంటూ పార్టీ లీడర్లకు పిలుపునిచ్చిన చంద్రబాబు, మనోళ్ళను కొనడానికి సిద్ధంగా ఉన్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చి, ఫలితాల తర్వాతి దృశ్యం ఎంత వేడిగా ఉంటుందన్న సంకేతాలిచ్చేశారు.
ఏపీలో కర్ణాటక తరహా పరిస్థితి ఏర్పడొచ్చన్న వార్తలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలకు మధ్య అతి తక్కువ సీట్ల తేడా ఉండొచ్చని, చివరి నిమిషంలో ‘హార్స్ ట్రేడింగ్’ తప్పదని కొన్ని సర్వేలు స్పష్టం చేశాయి కూడా. ఇదే పరిస్థితి నెలకొంటే ఒక్కో ఎమ్మెల్యే తలకూ వెల కట్టడం ఖాయం.
అందుకే.. ఒక పార్టీ క్యాంపు రాజకీయాలకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు మరో పార్టీ ఆరోపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇటువంటప్పుడు డీకే శివకుమార్ అనే బిగ్ షాట్ ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ఎమ్మెల్యేల్ని గొర్రెల్లా మార్చి ఒక రిసార్ట్లో దాచిపెట్టడంతో పాటు.. బైటిపార్టీ ఎమ్మెల్యేల్ని ఎట్రాక్ట్ చేయడం అనే కళాత్మక రాజకీయంలో కొందరు మాత్రమే ఆరితేరి వుంటారు.
చదవండి: వైసీపీ కీలక నేతలకి జగన్ సీరియస్ వార్నింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
ఇటువంటి ఆపత్కాలంలో టీడీపీకి వెన్నెముకలా వ్యవహరించి, పార్టీని నిలబెట్టిన అనుభవం ఎంపీ సీఎం రమేష్కి పుష్కలంగా వుంది. గతంలో టీఆరెస్తో పొత్తు కుదర్చడం నుంచి.. నిన్నమొన్నటి కడప జిల్లా రాజకీయాల్ని చక్కబెట్టడం వరకూ సీఎం రమేష్ ‘సత్తా’ చాటుకున్నారు. అందుకే చంద్రబాబుకు ఆయనంటే ప్రత్యేక గౌరవం. మంత్రి నారాయణ, మరో ఎంపీ సుజనా చౌదరి ఉన్నప్పటికీ వాళ్లలో ఈ తరహా చురుకుదనం లేదు.
రేపటిరోజున ఫలితాలు వెలువడి ఏపీలో నంబర్ గేమ్ షురూ అయితే, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం లేదా ఎమ్మెల్యేల్ని కొనుక్కోవడం లాంటివి తప్పనిసరి పనులు. ఈ సమయంలో సీఎం రమేష్ అండగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక్కడే టీడీపీ అధిష్టానం నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. సీఎం రమేష్ ఇప్పటికే ఐటీ అధికారుల నిఘాలో వున్నారు.
ఐటీ శాఖ తన చేతులు కట్టేసినట్లు చేసిందని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనలేనని బాబు దగ్గర ఆయన తెగేసి చెప్పారట. మే 23 తర్వాత టీడీపీకి ట్రబుల్ షూటర్ పాత్ర పోషించడానికి మరో పెద్ద చేతి కోసం బాబు వెతుకుతున్నారట. అయినా ‘వైస్రాయ్ హోటల్’ లాంటి ఘరానా ఎపిసోడ్నే లీడ్ చేసిన చంద్రబాబుకు మరొకరి సాయం అవసరమా అంటూ సమర్థించుకుంటోంది అమరావతి తెలుగు తమ్ముళ్ల శిబిరం.