అమరావతి: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమికి కారణాలంటో అధినేత చంద్రబాబు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు అన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నారని విమర్శించారు.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అందరూ మెచ్చుకునేలా జగన్ పరిపాలన సాగుతోందని గిరిధర్ కితాబిచ్చారు. జగన్ పాలన అవినీతిని అరికట్టేలా ఉందని ప్రశంసించారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా మద్దాలి సూటిగా ప్రశ్నించారు.
ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబేనని ఆరోపించారు. తన హయాంలోని అవినీతిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని మద్దాలి డిమాండ్ చేశారు.
పార్టీ మారేందుకే ఆయన చంద్రబాబుపై ఈస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది.