నగరి: ఎన్నికల ఫలితాలకు ఖచ్చితంగా నెల రోజుల సమయం ఉంది. అయితే, ప్రముఖలు గెలుపు-ఓటమలు పైన మాత్రం పార్టీల్లోనే కాదు..సామాన్యల్లోనూ ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇక బెట్టింగ్ రాయుళ్లుకు చేతినిండా పని దొరికింది. ఇక, ప్రధానంగా వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా పోటీ చేసిన నగరి స్థానంపైన ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొని ఉంది.
ఇక్కడ రోజా గెలుపు ఖాయమని కొందరు చెబుతుంటే..తాము గెలవటం ఖాయమని తమ అధినేత సమక్షంలోనే టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేయటం చర్చ నీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ది రోజా టిడిపి అభ్యర్ది గాలి ముద్దు కృష్ణమనాయుడు పై స్వల్ప మెజార్టీతో తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుండి వైసిపిలో ఫైర్ బ్రాండ్గా మారారు.
అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఇడిపి అధినేత చంద్రబాబు..లోకేశ్ పైన ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇక, తాజా ఎన్నికల్లో రోజా కేవలం నగరికే పరిమితం అయ్యారు. రోజాకు మద్దతుగా జగన్ నగరిలో ప్రచారం చేసారు. ఇక, పోలింగ్ జరిగిన నాటి నుండి రోజా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. పోలింగ్ సరళి..తన విజయావకాశాలపైనా మాట్లాడలేదు.
ఇదే సమయంలో టిడిపి నుండి పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు మాత్రం తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలోనూ ఇదే విషయాన్ని వివరించారు. అయితే, నియోజకవర్గంలో టిడిపికి అండగా ఉండే ఓ కీలక కుటుంబం రోజాకు మద్దతుగా పని చేసిందని ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నగరి నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. నియోజకవర్గంలోని అయిదు మండలాలు అయిన నగరి, పుత్తూరు, వడమాల పేట, నిండ్ర, విజయపురంలో మొత్తం ఈ సారి 1,67,915 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే 0.98 శాతం అధికంగా పోలింగ్ శాతం నమోదైంది.
ఇందులో మహిళా ఓటర్లు 85,269 మంది కాగా..పురుష ఓటర్లు 82,646 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, నగరి పరిధిలోని అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే తమ ఓటు వేసారు. పుత్తూరు మండలంలో తమకు మెజార్టీ ఖాయమని టిడిపి అంచనా వేస్తోంది. మిగిలిన మండలాల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే ఖచ్చితంగా తాము అయిదు వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో పార్టీ అధినేత వద్ద జరిగిన సమావేశంలోనూ టిడిపి నేతలు ఇదే లెక్కలను వివరించారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందటంతో పాటుగా..ఈ సారి రోజాను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టిడిపి అధినేత నగరి పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. టిడిపి అభ్యర్దికి మద్దతుగా నగరిలో ప్రచారం సైతం నిర్వహించారు.
కానీ, టిడిపిలో ఉన్న అంతర్గత సమస్యల కారణంగా వైసిపి విజయం ఇక్కడ ఖాయమని స్థానిక నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికలు పూర్తయిన నాటి నుండే రోజా 2019 ఎన్నికల కోసం ప్రణాళికా బద్దంగా వ్యవహరించారు. దీంతో..రోజా గెలుపు పై భారీగా బెట్టింగ్లు కాస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో..రోజా రాజకీయ భవితవ్యం తేలాలంటే మరో 30 రోజులు వేచి చూడాల్సిందే..
చదవండి: సర్వేలతో పనేంటి?.. ఏపీ సీఎం ఎవరో చెప్పేసిన రైతు!