అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 175 స్థానాలకి గాను 151 స్థానాల్లో జయభేరి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ నెల 30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతుంది. అయితే అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఎన్నికల ఫలితాలకి ముందు స్పీకర్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో స్పీకర్ పదవి నగరి ఎమ్మెల్యే రోజాని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ రోజా స్పీకర్ అయితే టీడీపీకి చుక్కలు చూపించడం ఖాయమని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షంలో ఉన్న రోజాని టీడీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది.
ఒకానొక సమయంలో అసెంబ్లీలో సీఎంని అవమానించారని చెప్పి…ఆమెని కొన్ని నెలల పాటు సస్పెండ్ కూడా చేశారు. అలాగే అనేక కార్యక్రమాల్లో రోజాని రాకుండా అడ్డుకున్నారు. ఇక రోజా ప్రాతినిద్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం అభివృద్ధి కూడా పెద్దగా నిధులు ఇవ్వలేదు.
ఇక ఈ ఎన్నికల్లో రోజా గెలవడమే కాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రోజా టీడీపీ నేతలకి చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే తనకి స్పీకర్ పదవి ఇస్తే…గతంలో తనని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రోజాని అధ్యక్షా అనాల్సి ఉంటుంది. దీంతో 40 ఏళ్ళు సీనియర్ అనే చెప్పుకునే బాబు ఇబ్బందే పడే అవకాశం ఉంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.