కలకలం: ఏపీలో ఐటీ దాడులు, మంత్రులు, టీడీపీ నేతల ఇళ్లే టార్గెట్!

IT
- Advertisement -

IT

విజయవాడ: టీపీసీసీ వర్కిగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటిదాక రేవంత్, అతని అనుచరుల ఇళ్ళపై దాడి చేసిన ఐటీ అధికారులు తాజాగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు, మంత్రుల ఇళ్ళను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల బందోబస్తుతో విజయవాడ, గుంటూరు, నెల్లూరు మొదలైన ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్ధాయిలో దాడులు నిర్వహస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నారాయణ విద్యా సంస్థలపై…

కానూరులోని నారాయణ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి ఐటీ అధికారులు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐటీ దాడులు వార్తలను మంత్రి నారాయణ ఖండించారు. తమ విద్యా సంస్థలపై ఇప్పటి వరకు ఎలాంటి దాడులు జరగలేదని తెలిపారు. గతంలోనే ఆదాయ పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు నారాయణ సంస్థలకు నోటీసులిచ్చారు. ట్రస్ట్ ద్వారా ఆ విద్యాసంస్ధలు నిర్వహిస్తున్నట్లు నారాయణ యజమాన్యం వివరణ కూడా ఇచ్చింది.

సదరన్ డెవలపర్స్ అలాగే వీఎస్ లాజిస్టిక్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. వీఎస్ లాజిస్టిక్స్ గుంటూరులో రైల్వే నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, రైల్వేకోచ్‌ల మరమ్మత్తులు చేస్తొంది.  ఈ రెండు సంస్థలకు సంబంధించిన హైదారాబాద్, విశాఖపట్నం, గుంటూరులోని  కార్యాలయాలు, ఇంకా ఆ సంస్థల ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

సదరన్ డెవలపర్స్ సంస్థ అమరావతి, పోలవరం కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రక్టు పనులను నిర్వహించినట్లు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ఐటీ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి మొత్తం పది బృందాలుగా అధికారులు ఈ దాడులకు వెళ్లినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నంలో…

అలాగే విశాఖపట్నంలో గురుద్వారా జంక్షన్‌లో ఉన్న శుభగృహ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సీతమ్మధారలోని ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో  కూడా ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టారు. జిఎస్టీని సక్రమంగా అమలు చేయడం లేదన్న కారణంతో పాటు భూముల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ చెల్లింపులకు భారీ వ్యత్యాసం ఉండటం వంటి వాటిపై ఫిర్యాదులు అందటంతో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పోలీస్ బందోబస్తు మధ్య డాక్యుమెంట్లను, రికార్డులు ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఆ డబ్బు ఆంధ్రా నుండి వచ్చిందే…

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నగదును ఆంధ్రప్రదేశ్ నేతలే అందిచారనే ఆరోపణల వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ, అవినీతి సోమ్ముతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు చాలా వచ్చాయి.

రాజధానిలో వందలాది ఎకరాలను కొనుగోలు చేసిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలపై ఐటి అధికారులు ప్రత్యేక ధృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు గురువారం రాత్రే పోలీసుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. చెన్నై, బెంగళూరు,  హైదరాబాద్ నుంచి మొత్తం 10 బృందాలుగా ఐటీ అధికారులు  ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు…

నెల్లూరులోని బీద మస్తాన్‌రావు ఆస్తులపై జరిగిన దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలు హడలిపోతున్నారు. కాగా, బీద మస్తాన్‌రావు కార్యాలయాలు, నివాసాల్లో వరుసగా రెండో రోజూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.   ఐటీ దాడుల నేపథ్యంలో  బీద మస్తాన్‌రావు, ఆయన సోదరుడైన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

- Advertisement -