అమరావతి: టీడీపీ ఘోర ఓటమి, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూశాక ఇంకా పెద్ద పదమేదైనా వాడలేమో అనిపించకమానదు. ఎందుకంటే 1992లో తెలుగు దేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఇంత దారుణంగా ఓటమి చవిచూడలేదు.
ఇది అసాధారణ పరాభవమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇప్పటివరకు ఐదుసార్లు విజయం సాధించింది. తాజా ఫలితాలతో కలిపి నాలుగుసార్లు ఓటమి చవిచూసింది.
అయితే అన్ని ఓటముల్లో ఇదే అతి ఘోరమైన ఓటమి. 1989లో టీడీపీ తొలి ఓటమి ఎదుర్కొంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీకి 90 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హవా కారణంగా కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు టీడీపీకి 47 సీట్లు వచ్చాయి.
చదవండి: లోక్సభ ఎన్నికల్లో ‘నమో’ సునామీ.. ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకుని…
ఆ తర్వాత 2009లో మరోసారి ఓటమి ఎదురైంది. కానీ అప్పుడు తొంభై సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2019లో మరోసారి ఓడిపోయింది. కానీ ఈ సారి ఒకానొక సందర్భంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందా లేదా అని అనిపించింది అంటే , టీడీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇక పొతే టీడీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఒక రకంగా జనసేన పార్టీయే కారణం అని చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీ విజయకేతనం ఎగేరేసింది. కానీ , ఈసారి జనసేన కూడా ఒంటిరిగా పోటీ చేయడంతో పరోక్షంగా టీడీపీ ఘోర ఓటమికి కారణమైయ్యాడు.
దాదాపుగా ఏపీ లోని చాలా నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు 10 వేల లోపు ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అదే సందర్భంలో జనసేన అభ్యర్థులకు ఇంచుమించుగా 10 నుండి 15 వేల ఓట్ల వరకు వచ్చాయని సమాచారం.
ఇదే గనుక టీడీపీ తో జనసేన కలిసి పోటీ చెసింటే టీడీపీ మరో సారి అధికారం చేపట్టేది అని స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి ప్రత్యేక్ష కారణం జగన్ అయితే , పరోక్ష కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.