అనంతపురం: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ముగ్గురిపై పోలీసులు వివిధ కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారని తెలిసిందే. మరోవైపు
మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగుతాయని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో జేసీ దివాకర్
రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీలో రేపు ఏమీ జరగబోదని, అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపేసి.. వైసీపీకి అవసరమైన బిల్లులు పాస్ చేసేసుకుంటారని జేసీ చెప్పారు. కేసులు ఉన్నా,
లేకపోయినా తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనేదే వైసీపీ యోచన అని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినా అరెస్ట్ చేయడమే దీనికి నిదర్శనమని చెప్పారు. తనపై
ఇప్పటి వరకూ ఎలాంటి కేసులూ లేవని, అయినా ఏదో ఒక కేసు పెట్టి తనను కూడా లోపల పడేస్తారని అభిప్రాయపడ్డారు. వాహనాలను అమ్మిన వారిని, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను వదిలేసి తమ
కుటుంబంపై అక్రమ కేసులు పెట్టడాన్ని దివాకర్ రెడ్డి తప్పుబట్టారు. తమ వారికి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, తప్పకుండా బెయిల్ వస్తుందని పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఎంతటి
ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పేందుకే నారా లోకేష్.. ఇంటికి వచ్చి మరీ తమను పరామర్శించారని వెల్లడించారు.