హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, మరో సీనియర్ నేత టీడీపీకి భారీ షాకిచ్చారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ స్థానం నుంచి టీడీపీ టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరికతో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.
‘ఇన్నిరోజులు ఎందుకు వైసీపీలో చేరలేదా అని అనిపించింది. నన్ను నెల్లూరు నుంచి పార్లమెంట్కు పోటీ చేయమన్నారు. అందుకు సిద్ధంగా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం. ఇక పార్టీ మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటిని నేను రేపు(ఆదివారం) నెల్లూరులోనే మాట్లాడతా’ అని అదాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
ఇది ఇలావుంటే, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని వంగా గీత ఆకాంక్షించారు.