ఏపీలో రాష్ట్రపతి పాలన!? కేంద్రంలో కదలికలు.. షాక్‌లో టీడీపీ నేతలు!

President Latest News, TDP Latest News, AP Latest News, Newsxpressonline
- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనమంతా ఒకలా అనుకుంటుంటే, కేంద్రం మరోలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 25 రోజుల్లో ఫలితాలు వస్తాయనీ, అప్పటివరకూ టీడీపీ అధికారంలో ఉండి… ఆ తర్వాత ఫలితాలను బట్టి అధికారంలో ఎవరు ఉండేదీ తెలుస్తుందని మనం అనుకుంటున్నాం. 
 
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 25 రోజులూ రాష్ట్రపతి పాలన తెచ్చే యోచనలో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రధానంగా ఉన్నతాధికారుల విషయంలో ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయంటున్నారు న్యాయ నిపుణులు.
 
టీటీడీ నగల విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైతం లేవనెత్తుతున్న ప్రశ్నలు.. అధికార పక్షానికి సవాలుగా మారబోతున్నాయనీ, ఈ పరిణామాలు కేంద్రం జోక్యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని తెలుస్తోంది.
 
ప్రస్తుతం ఏపీలో చాలా సమస్యలున్నాయి. ఎండలు పెరిగాయి. తాగునీటి సమస్య ఎక్కువవుతోంది. అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. శ్రీలంకలో పేలుళ్ల ప్రభావంతో ఏపీలో కూడా శాంతిభద్రతలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి.
 
 
మరోవైపు విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇదే సమయంలో ఉన్నతాధికారులు తమదైన సొంత ప్రకటనలు చేస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం తమపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఉన్నతాధికారులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులు తమకు సహకరించట్లేదని ప్రభుత్వం మండిపడుతోంది.
 

టీటీడీ నగల వివాదం కూడా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తోంది. బంగారం తరలింపు వెనక టీడీపీ కుట్ర ఉందంటున్న వైసీపీ.. వారం రోజుల్లో ఆధారాలతో సహా ఆ విషయాన్ని నిరూపిస్తామని ప్రకటించింది.

బంగారం విషయంలో టీటీడీ, ప్రభుత్వం రెండూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదనీ, తెరవెనక కుట్ర ఉన్నందువల్లే ఇలా చేశాయనీ వైసీపీ ఆరోపిస్తోంది. కావాలనే లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తూ… లబ్ది పొందేందుకు వైసీపీ యత్నిస్తోందని టీడీపీ కౌంటర్లు ఇస్తోంది. ఇలా రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

నిఘా వర్గాల సమాచారం నిజమేనా?

ఇవన్నీ గమనిస్తున్న కేంద్రం.. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని భావిస్తున్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తుండటంతో… కేంద్రం అలర్ట్ అవుతోంది.

ముఖ్యంగా ఫలితాల ప్రకటన రోజున రాష్ట్రంలో కచ్చితంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని నిఘా వర్గాలు చెప్పడంతో ముందుగానే రాష్ట్రపతి పాలన తెచ్చే ఆప్షన్‌ను కేంద్రం పరిశీలిస్తోందని తెలిసింది. ఫలితాలకు ముందే రాష్ట్రపతి పాలన తెస్తే, టీడీపీ పూర్తిస్థాయి అధికారంలో ఉన్నట్లు అవ్వదు.
 
అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామమే. ఐతే రాష్ట్రపతి పాలన తెచ్చేంత దారుణ పరిస్థితులు ఏవీ లేవంటున్న టీడీపీ వర్గాలు… అంతా వైసీపీ చేస్తున్న హైడ్రామా అని కొట్టిపారేస్తున్నాయి. ఫలితాల రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేకుండా చేస్తామంటున్నాయి.
- Advertisement -