హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలకు ఈ ఏడాది మహర్దశ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం ఆరు ఎయిర్పోర్టుల బహుముఖ అభివృద్ధికి నిర్ణయం జరగ్గా.. అందులో తెలంగాణలోని శంషాబాద్, ఏపీకి చెందిన విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఉన్నాయి.
ప్రభుత్వ ప్రణాళికలు పట్టాలెక్కితే.. వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం కూడా త్వరలోనే ఈ జాబితాలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రాజెక్టులకు ఒక రూపం రావాలంటే ఏఏఐ లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సి ఉంటుందని విజయవాడ ఎయిర్పోర్టు డైరెక్టర్ జీఎంఎస్ రావు తెలిపారు.
‘‘ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణాలకు సర్వేలు జరిగాయి.. పరిస్థితి సానుకూలంగా ఉంది.. ఈ ప్రాజెక్టులు ఒక రూపు దాల్చాలంటే.. ఏఏఐ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి.. తద్వారా ‘ఉడాన్’ పథకంలో భాగంగా వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది..’’ అని ఆయన పేర్కొన్నారు. సర్వే కమిటీలోనూ ఈయన సభ్యుడు కావడం గమనార్హం.
తెలంగాణలో…
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 66 చోట్లకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 18 విదేశీ, 48 దేశీయ ప్రదేశాలు. గత ఏడాది జనవరి నుంచి నవంబరు వరకూ ప్రయాణికుల రద్దీ కోటి 89 లక్షలు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 21 శాతం అధికం. ఇక ఇదే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కదలికలు 1.6 లక్షలుగా ఉంది.
సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైనాస్ గత ఏడాది శంషాబాద్ విమానాశ్రయం నుంచి రియాధ్కు సర్వీసులు ప్రారంభించింది. స్పైస్జెట్ సంస్థ కూడా ఇక్కడ్నించి బ్యాంకాక్కు సర్వీసులు ప్రారంభించింది. గడిచిన ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి పది కొత్త ప్రదేశాలకు కనెక్టివిటీ ఏర్పడింది. కాలికట్, అమృత్సర్, వడోదర, పోర్ట్బ్లెయిర్, ఉదయ్పూర్ తదిరత ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.