అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును న్యాయస్థానం జులై 10 వరకు పొడిగించింది. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించి అచ్చెన్నాయుడిని మూడో రోజూ విచారించిన ఏసీబీ అధికారులు వివిధ ప్రశ్నలు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
గుంటూరు జీజీహెచ్లో ఇవాళ మొత్తం మూడున్నర గంటల పాటు విచారించారు. మూడు రోజుల్లో కలిపి పదకొండున్నర గంటల పాటు అచ్చెన్నాయుడు విచారణ కొనసాగింది. ముఖ్యంగా ఈఎస్ఐ టెలీ హెల్త్ సర్వీసెస్కు సంబంధించి టెండర్లపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన సిఫార్సు లేఖపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం.
కాగా, జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆపరేషన్ గాయం నుంచి అచ్చెన్నాయుడు దాదాపు కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.