అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెల్సిందే. ఆ పార్టీ 175 స్థానాలకి గాను 23 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మూడు పార్లమెంట్ స్థానాలని గెలుచుకుంది.
ఇక వైసీపీ 151 అసెంబ్లీ,, 22 పార్లమెంట్ సీట్లని గెలుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు అయిన దగ్గర నుంచి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా టీడీపీని వీడబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ వార్తలపై స్పందించిన రామానాయుడు…తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ప్రకటించారు.
అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని, ప్రజాసేవకు పదవులు అక్కర్లేదన్నారు. సంకల్పం ఉంటే చాలు అని అభిప్రాయపడ్డారు.
కాగా, గత ఎన్నికల్లో పశ్చిమ గొదావరిలొ క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ… ఈ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది.