అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారా, లేక విపక్ష నేత వైఎస్ జగన్ సీఎం అవుతారా అన్నది మరో 39 రోజులు గడిస్తేగాని చెప్పలేము. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
ఓవైపు చంద్రబాబునాయుడు ఈవీఎంల్లో అవకతవకలు అంటూ ఈసీ చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ తెలుగు, ఇంగ్లిష్లో రాసిన నేమ్ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.
ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద ఆ పార్టీ ముందు నుంచి ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే కేడర్లో మరింత ఉత్సాహం నింపేందుకు కౌంట్ డౌన్ క్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 పోలింగ్ తేదీ నాటికి ఆ కౌంట్ డౌన్ పూర్తయ్యేలా క్లాక్ సెట్ చేశారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ దశలో వైసీపీది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా అనే చర్చ కూడా మొదలైంది.
అయితే, కేడర్లో మనోధైర్యం నింపేందుకు ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయినట్టు రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి అంటూ నేమ్ బోర్డు కూడా రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఈనెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న రిలీజ్ కానున్నాయి.
అలాగే నిన్న చంద్రబాబు, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ మార్ఫింగ్ ఫోటోను షేర్ చేయగా, అది కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.