శివాజీని అరెస్ట్ చేయండి.. జగన్‌పై దాడి ముందే తెలుసు.. అందుకే అమెరికా పారిపోయాడు: వైసీపీ నేత రోజా

roja
- Advertisement -

roja

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి‌పై హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం పని చేస్తోందని వైసీపీ నాయకురాలు రోజా విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి గురువారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.

నిందితుడు శ్రీనివాస్‌రావుని కస్టడీలోకి తీసుకోకముందే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అభిమానే ఆయనపై దాడి చేశాడని చెప్పడమే ఇందుకు నిదర్శనం అని ఆమె అన్నారు. వైఎస్ జగన్‌ను అంతమొందించేందుకు భారీ స్కెచ్ వేశారనీ, దీని వెనుక భారీ లక్ష్యం ఉందని రోజా అనుమానం వ్యక్తం చేశారు.

‘‘జగన్ పోతే.. బాబుకే లాభం..’’

ఒకవేళ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చనిపోతే అందరికంటే ఎక్కువ లాభం చంద్రబాబు నాయుడికేనని రోజా ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌లో తనకు రాజకీయంగా ఎదురులేదని భావించిన చంద్రబాబుకు వైఎస్ జగన్ అడ్డుగా నిలిచారని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నిచంద్రబాబు భుజాలపై మోసి జగన్‌ను జైలులో పెట్టించారని వెల్లడించారు.

ఇప్పటికీ 22 మంది ఎమ్మెల్యేలను కొని రాజకీయంగా తొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. జగన్‌కు వస్తున్న అశేష జనాదరణను చూసి తట్టుకోలేకే ఈ ఘాతుకానికి తెగబడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.

‘ఆపరేషన్ గరుడ’ అంటూ ఆరోపణలు చేసిన నటుడు ‘శివాజీ’ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. శివాజీని అరెస్ట్ చేసి ఈ ‘ఆపరేషన్ గరుడ’ వెనుక ఉన్న కేంద్రంలోని కుట్రదారులు, రాష్ట్రంలోని సూత్రధారులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

‘ఆపరేషన్ గరుడ’ ఎప్పుడు జరుగుతుందో టైమ్ తెలుసు కాబట్టే శివాజీ అమెరికాకు పారిపోయి దాక్కున్నాడని ఆరోపించారు. శివాజీపై చర్యలు తీసుకుని దోషులను పట్టుకోకుంటే వైసీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఊరుకోబోరని కూడా రోజా హెచ్చరించారు. సినిమాలేని ఆర్టిస్టు చేసిన ‘ఆపరేషన్ గరుడ’ వాదనలను సీఎం చంద్రబాబు సిగ్గులేకుండా వల్లిస్తున్నారని విమర్శించారు.

వైఎస్ జగన్‌పై మంత్రి సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వీరు అసలు మనుషులా? అన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు పని చేస్తున్న రెస్టారెంట్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ జగన్‌‌పై దాడి చేసిన కత్తిని రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి జనవరి నుంచి ఎందుకు దాచాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ఈ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించాలని రోజా డిమాండ్ చేశారు.

 

- Advertisement -