కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులకు తాళాలేకే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నిందితడు శ్రీనివాసుల రెడ్డి సూసూడ్ లేఖలో పేర్కొన్నాడు.
వివేకా హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కరరెడ్డిలకు శ్రీనివాసుల రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశాడు.
మరోవైపు, శ్రీనివాసులరెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసుల రెడ్డి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వివేకా హత్యకేసు విచారణను వేగంవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది.
పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్ తీసుకెళ్లారు. విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో సుమారు 60 మందిని ప్రశ్నించారు.
చివరకు సాక్ష్యాలు తారుమారుచేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 90 రోజుల రిమాండ్ అనంతరం వీరికి జూన్ 27న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.