అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో వరుసగా ఎక్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే వివరాలు విడుదలయ్యాయి.
ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి… ఈరోజు సాయంత్రం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై తన అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-79 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి తెలిపారు.
ఈ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని అర్ధమైపోతుంది. ఇక లోక్ సభ స్థానాల విషయానికొచ్చే సరికి రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది.
చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో వైసీపీ జోరుకి బ్రేకులు లేవు!
ఇక రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుచూపారని.. పురుష ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేశారని ఈ సర్వేలో తేలింది. ఇక యువత ఓట్లు జనసేన, వైసీపీకి ఎక్కువగా పడినట్టు సర్వే అభిప్రాయపడింది.
అటు ఓట్ల శాతానికి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 40 నుంచి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేనకు 10 నుంచి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
తెలంగాణలో టీఆర్ఎస్ హవా
ఇక తెలంగాణలో 17 స్థానాలకి జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై రాజగోపాల్ తమ సర్వే వివరాలని తెలిపారు. ఆర్జీ ఫ్లాష్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 14-16, కాంగ్రెస్ 0-2, బీజేపీ 0-1, ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశం ఉందని వెల్లడించారు.