హోనలులు, హవాయి : ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో అత్యంత ప్రమాదకరమైన(క్రీయాశీల) అగ్నిపర్వతంగా పేరున్న కిలౌయి అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున లావాను వెదజల్లుతోంది. ఫలితంగా శనివారం హవాయి దీవుల చరిత్రలో భారీ భూకంపం సంభవించింది. గత నలభై ఏళ్లలో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. రిక్టర్ స్కేలుపై 7.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) వెల్లడించింది.
శుక్రవారం రోజున కూడా వరుసగా రెండు భూకంపాలు(5.6 ; 6.9 తీవ్రతలతో) సంభవించాయి. దీంతో హవాయి ద్వీప ప్రజలు భయంతో వణికిపోయారు. తూర్పు హవాయి ద్వీపం వైపు పెద్ద ఎత్తున లావా వస్తుండటంతో ఆ ప్రాంతంలోని 1700 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ భూకంపాల కారణంగా భూమిలోంచి పెద్ద ఎత్తున బయటికొస్తోన్న సల్ఫర్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోంది.
ఈ వాయువును పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముక్కు, గొంతులో తీవ్రంగా మంట వచ్చి శ్వాస తీసుకోలేక మనుషులు మరణిస్తారు. స్వల్పస్థాయి భూకంపాలను కలుపుకుని గత వారం రోజుల్లో హవాయిలో 1000కి పైగా సంభవించాయి.
సునామీ భయం లేదు…
అయితే హవాయి దీవుల్లో ఇలా అత్యంత భారీ స్థాయిలో భూకంపాలు సంభవించినప్పుడు సునామీ రావడం సహజం. కానీ, ప్రస్తుత భూకంపాల వల్ల హవాయికి ఆ ముప్పు మాత్రం లేదని సునామీ నిపుణులు చెబుతున్నారు.