న్యూఢిల్లీ: ఓవైపు కరోనా వైరస్తో వేగలేక చస్తోంటే.. మరోవైపు ‘అంఫన్’ తుపాను దూసుకొస్తోంది. ఈ తుపాను గురించి ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీనిని ‘సూపర్ సైక్లోన్’గా అభివర్ణిస్తున్నారు. ఒడిశాలోని పారాదీప్కు దక్షిణంగా 520 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడటం ఇది రెండోసారి.
ప్రస్తుతం అంఫన్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని, బుధవారం నాటికి ఈ తుపాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతియా దీవుల నడుమ ఈ తుపాను తీరం దాటే సమయంలో 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వారు వివరిస్తున్నారు.
ఆ 6 జిల్లాల్లో జాగ్రత్త…
‘అంఫన్’ తుపాను వల్ల ఒడిశాలోని ఆరు జిల్లాలు తీవ్ర ప్రభావితం కానున్నాయని ఐఎమ్డీ హెచ్చరించింది.
తీరం దాటిన వెంటనే కేంద్రపారా, భద్రక్, మయూర్భంజ్, జైపూర్, జగత్సింగ్పూర్ జిల్లాల్లో తుపాను బీభత్సం అధికంగా ఉంటుందని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు.
ఇక మంగళవారం సాయంత్రం నుంచే ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్సింగ్ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులతో ‘అంఫన్’ తన ప్రభావాన్ని చూపుతోంది.
ఈ తుపాను ప్రభావం ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్పైనా అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని లక్షలాది తీరప్రాంత వాసులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
‘‘1999 తరువాత రెండోసారి ఇలా…’’
‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్ మత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్తో కలిసి మత్యుంజయ్ మహాపాత్ర మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం సముద్రంలో దీని గాలి వేగం 200-240 కిలోమీటర్లుగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో తుపాను తీవ్రత అధికంగా ఉండే అవకాశముందన్నారు.
ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు ఈసారి కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చని మత్యుంజయ్ మహాపాత్ర వివరించారు.
‘‘ఇప్పుడు మన ముందు రెండు సవాళ్లు…’’
కరోనా, అంఫన్ తుపానులతో ప్రస్తుతం మనం రెండు సవాళ్లను ఎదుర్కొనవలసి ఉందని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తమ బృందాలను బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో 19, ఒడిశాలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించామని, అదనంగా మరో 6 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను కూడా సిద్ధంగా ఉంచామని, ప్రతి బెటాలియన్లో నాలుగు బృందాలు ఉంటాయని ఆయన వివరించారు.
‘‘జనరేటర్లు, డీజిల్తో సిద్ధంగా ఉండండి…’’
‘అంఫన్’ తుపాను నేపథ్యంలో దాని ప్రభావిత ప్రాంతాల్లోని టెలికం సర్వీసు ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ సూచించారు.
ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. తగిన సంఖ్యలో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేసుకుని, సరిపడా డీజిల్తో సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
ఒకవేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం గనుక ఏర్పడితే.. జనరేటర్ల సహాయంతో టెలికం టవర్లను పని చేయించవచ్చని తెలిపారు. తుపాను తీరం దాటేవరకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ కొనసాగుతుందని వెల్లడించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎస్సెమ్మెస్ల ద్వారా సమాచారం చేరవేయనున్నట్లు చెప్పారు. వీటిని స్థానిక భాషల్లో.. ఉచితంగా ఈ సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
#WATCH: Rainfall and strong winds hit Digha in West Bengal. #CycloneAmphan is expected to make landfall tomorrow. pic.twitter.com/sglWtx4MbJ
— ANI (@ANI) May 19, 2020