ఇడ్లీ బామ్మకు ఆనంద్ మహింద్రా చేయూత

- Advertisement -

 చెన్నై: రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తూ.. పేదల కడుపు నింపుతున్న ఆ బామ్మ గుర్తుందా? తమిళనాడులోని వడివేలంపాళ్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది.

80 ఏళ్ల వయసులోనూ ఉదయాన్నే నిద్రలేచి, పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమయ్యే ఈ బామ్మకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ సమాచారం అలా అలా తిరిగి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే  మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రాకు చేరింది. ముదిమి వయసులో కట్టెల పొయ్యిపై కష్టపడి వ్యాపారం చేస్తున్న ఆ బామ్మను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. కట్టెల పొయ్యిపైనే ఆమె ఇడ్లీలు వేస్తున్న ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమలతాల్ వీడియోను ట్వీట్ చేశారు.

‘‘మనలను ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత గాథల్లో ఇది కూడా ఒకటి. కమలతాల్ వంటి వారికి కొంత సాయం చేసినా.. ఎంతో మందికి మంచి జరుగుతోంది. ఆ బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యే వాడుతున్నారు. మీకు ఎవరికైనా ఆమె తెలిస్తే నాకు చెప్పండి. నేను ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతా. గ్యాస్ స్టవ్ కొనిస్తా’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

ఆయన ట్వీట్‌పై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైతం స్పందించింది. ‘‘బాగా చెప్పారు సర్. దేశం కోసం ఇండియన్ ఆయిల్‌ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో దాన్ని తన సామాజిక సేవతో ఆమె మరింత ప్రతిధ్వనింప చేస్తున్నారు…’’ అని పేర్కొంది. ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేసిట్టు వెల్లడించింది.

- Advertisement -