ఈ పోరాటం ఆగదు: లోక్‌పాల్ వచ్చేదాక దీక్ష విరమించేది లేదన్న హజారే

hazare
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు. తాను దీక్ష చేసే విషయాన్ని అంతకుముందే మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు హజారే.

‘లోక్‌పాల్‌ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. కానీ ఇంతవరకూ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించలేదు. అసలు ఏ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేదు’ అని దీక్ష సందర్భంగా హజారే అసహనం వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌, లోకాయుక్తలను ఏర్పాటుచేసే వరకూ తాను నిరాహార దీక్ష విరమించబోనని తేల్చి చెప్పారు.

ఐదేళ్లు గడిచిపోయాయి కానీ.. : హజారే

‘2014లో అవినీతి రహిత ప్రభుత్వం అనే నినాదంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన లోక్‌పాల్‌ బిల్లును అమలు చేస్తారని, తద్వారా దేశంలో అవినీతికి కళ్లెం పడుతుందని ఆశించా. కానీ, ఐదేళ్లు గడిచిపోయాయి. లేఖలూ రాశా. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు’ అని అన్నా హజారే వ్యాఖ్యానించారు.

‘కేంద్రం ప్రభుత్వం కావాలనే దీన్ని ఆలస్యం చేస్తూ వస్తోంది. అందుకే నేను మరోసారి దీక్షకు దిగుతున్నా’ అని ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా హజారే తెలిపారు. లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాలపై హజారే గతంలోనూ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -