లక్నో: ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నిజయోకవర్గంలోని ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని విజ్ఞప్తి చేశారు.
చదవండి: మీకే కనుక దమ్ముంటే.. వైఎస్ జగన్కు దేవినేని ఉమ సవాల్
ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో రాజకీయంగా పెను దుమారం రేగింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ నేను బహిరంగంగా ఒక మాట చెబుతున్నాను. మీరెవరూ ముస్లింల నుంచి కూరగాయలు కొనొద్దు’’ అని కోరారు.
ఆ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్పందించిన తివారీ వివరణ ఇస్తూ.. తాను అలా అన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
కరోనా వైరస్ వ్యాప్తిలో తబ్లిగీ జమాత్ సభ్యుల పాత్ర ఉందని చాలా మంది తనకు పిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వారి నుంచి కూరగాయలు కొనొద్దని ముందుజాగ్రత్త చర్యగా సూచించానని పేర్కొన్నారు.
మండిపడ్డ కాంగ్రెస్…
తివారీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. దేశం మొత్తం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బీజేపీ నేతలు మాత్రం ద్వేషాన్ని పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ మండిపడ్డారు.
చదవండి: నా వీడియోలు ట్రోల్ చేస్తున్నారు: పోలీసులకు కమెడియన్ పృథ్వీ ఫిర్యాదు
ఇది సిగ్గుపడే విషయమని, బీజేపీ అసలు రంగు ఇదేనని అన్నారు. కరోనా వైరస్ను వ్యాపింపజేస్తున్నారంటూ తబ్లిగీ జమాతీలను నిందిస్తున్నారని, కానీ వారు తమ ప్లాస్మాను కరోనా రోగుల కోసం డొనేట్ చేస్తున్న విషయం మర్చిపోవద్దన్నారు.