ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గట్లేదు. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో ముందుకు వెళుతున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
విపక్షాలకి చెందిన పలువురు నేతలను కలుస్తూ మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సోనియాగాంధీ, రాహుల్, అఖిలేశ్, మమత, శరద్ పవార్, మాయావతి వంటి నేతలను కలిసిన చంద్రబాబు ఫలితాల అనంతర పరిస్థితులపై చర్చించారు.
కాగా, నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు చంద్రబాబు నేతృత్వంలో బీజేపీయేతర పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీయేకు మెజారిటీ కాకపోతే ఎన్డీయేతర పార్టీలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరే అంశం మీద చర్చిస్తారు. అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్(కాంగ్రెస్), శరద్ పవార్(ఎన్సీపీ), చంద్రబాబు, సతీశ్ చంద్ర(బీఎస్పీ), సీతారాం ఏచూరి(సీపీఎం), రాజా(సీపీఐ), డెరెక్ ఓ బ్రెయిన్(తృణమూల్) ఈ సమావేశానికి రానున్నారు.
వీరంతా బుధవారం ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. అయితే వీరి డిమాండ్కి ఎన్నికల సంఘం నుంచి సానుకూలంగా స్పందించకపోతే అక్కడే ధర్నాకి దిగే అవకాశం ఉంది.