న్యూఢిల్లీ: తాను భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో వివరించారు మాజీ మంత్రి డీకే అరుణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమక్షంలో మంగళవారం రాత్రి ఆమె ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్రావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని డీకే అరుణ విమర్శించారు. ఎన్నో మాయమటలు చెప్పి ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా క్షీణించిపోతోందని.. అందుకు కాంగ్రెస్ ముఖ్య నేతల వ్యవహారశైలే కారణమని ఆరోపించారు.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే…
టీఆర్ఎస్తో లాలూచీ పడి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేశారని డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీకే అవకాశం ఉందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించే శక్తి కేవలం మోడీ నాయకత్వంలోని బీజేపీకే ఉందని భావించి.. తాను బీజేపీలో చేరినట్టు డీకే అరుణ స్పష్టంచేశారు. తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. డీకే అరుణ చేరికతో తెలంగాణలో బీజేపీకి బలం చేకూరుతుందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కాంగ్రెస్కు లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు విసిగి డీకే అరుణ బీజేపీలో చేరారని వివరించారు.
కేంద్రంలో చక్రం తిప్పడం కాదు బొంగరం కూడా తిప్పలేరని కేసీఆర్పై మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆటలను కట్టడి చేయడానికి అరుణలాంటి నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కాగా, యన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా సొంత గూడైన బీజేపీలో చేరారు. ఇంకా చాలా మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా లక్ష్మణ్ తెలిపారు.