లక్నో: 8 మంది పోలీసులను మట్టుబెట్టిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాశ్ దూబేకు సంబంధించి ఓ సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా 1999లో వచ్చిన ‘అర్జున్ పండిట్’ సినిమా అంటే దూబేకు ఎనలేని ఇష్టమట. ఆ సినిమాను వందలాది సార్లు చూశాడట. అతడి గురించి తెలిసిన స్థానిక జర్నలిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆ సినిమాలోలానే తనను కూడా అందరూ ‘పండిట్’ అని పిలవాలని కోరుకునేవాడట. రాజకీయ, పోలీసు వర్గాల్లో చాలామంది ఇతడి మెప్పుకోసం అలా పిలిచేవారని కూడా ఆ జర్నలిస్టులు పేర్కొన్నారు. అయితే దూబే నేర చరిత్రకు, ఆ సినిమాకు అస్సలు పోలిక ఉండకపోవడం గమనార్హం.
ఆ చిత్రంలో అర్జున్ (సన్నీ డియోల్) ఓ పవర్ ఫుల్ వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతాడు. ఓ నేరాన్ని చూసి కూడా కామ్ గా ఉండిపోవడం, తాను ప్రేమించిన ప్రియురాలే తనను మోసం చేయడంతో గ్యాంగ్స్టర్గా మారిపోవడం వంటి కథలో సినిమా అలా అలా సాగిపోతోంది.
అయితే, ఈ సినిమాలో మాత్రం దూబేను ఆకర్షించింది ఒక్క పండిట్ అన్న పదమేనట. మరోవైపు, దూబే నేర చరిత్ర గురించి తెలిసిన అతడి కుటుంబం క్రమంగా దూబేను దూరం పెట్టింది. ఇటీవల ఎన్కౌంటర్ తర్వాత దూబే తల్లి మాట్లాడుతూ తన కుమారుడిని పోలీసులు అంతమొందించాలని కోరారు.