జూన్ 1 నుంచి ఐదో విడత లాక్‌డౌన్.. సడలింపులు ఇవేనా?

- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెలాఖరుతో నాలుగో విడత లాక్‌డౌన్  ముగియనుంది. జూన్ 1 నుంచి ఐదో విడత లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉండటంతో ఈసారి నిబంధనల సడలింపు ఏవిధంగా ఉండబోతోందనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వీటికి తుదిరూపం ఇస్తోంది.

ప్రధానంగా పర్యాటక, అతిథ్య రంగాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈసారి నిబంధనలు ఉండబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ప్రకారం, హోటల్స్, డైన్-ఇన్ రెస్టారెంట్లు, బీచ్‌లు ఐదో విడత లాక్‌డౌన్‌లో తెరిచే అవకాశాలున్నాయి.

హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం తెరవాలని, పరిమితి సంఖ్యలో విజిటర్లకు అవకాశం ఇవ్వాలని, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలని రాష్ట్రాలు ఇప్పటికే సూచించాయి.

దీంతో పరిమితమైన సిట్టింగ్ కెపాసిటీతో డైన్-ఇన్ సౌకర్యాలు తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెంపరేచర్ చెకప్, ఆరోగ్య సేతు యాప్‌ను విజిటర్లకు తప్పనిసరి చేయనున్నారు.

ఈ తరహా సడలింపులు ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు తమ ఆర్థిక కార్యక్రమాలు తిరిగి ప్రారంభించుకునేందుకు కేంద్ర వెసులుబాటు ఇవ్వనుందని తెలుస్తోంది.

‘టూరిజం, ఆతిథ్య రంగాలపై ప్రధానంగా ఆధారపడే రాష్ట్రాలు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆ రంగాల్లో సడలింపులు ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి.

టూరిజం, ఆతిథ్య రంగాలకు లాక్‌డౌన్ 5.0లో ఉపశమనం కలిగే అవకాశం ఉంది’ అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పుదుచ్చేరి, కేరళ, గోవా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా పర్యాటకం, ఆతిథ్య రంగంపై ఆధారపడి ఉన్నాయి. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఇప్పటికీ ఆ రాష్ట్రాలకు ఎలాంటి ఉపశమనం కలగ లేదు.

50 శాతం సామర్థ్యం, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలతో టూరిజం, ఆతిథ్య రంగాలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోనులో తెలియజేశానని, జిమ్‌లు కూడా తెరవాలని చాలామంది కోరుతున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చానని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ మహాజన్ ఇప్పటికే వెల్లడించారు. లాక్‌డౌన్ మరో 15 రోజులు పొడిగించాలని కూడా ఆయన కేంద్రానికి సూచించారు.

- Advertisement -