న్యూఢిల్లీ: దేశంలో అంతకంతకూ తీవ్రమవుతోన్న కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్త లాక్డౌన్ను మరోమారు పొడిగించక తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. లాక్డౌన్ పొడిగింపునకు ప్రజలంతా సంసిద్ధులై ఉండాలన్నారు.
అయితే లాక్డౌన్ 4.0 మరింత భిన్నంగా ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాలను ఈ నెల 18 వ తేదీలోపే దేశ ప్రజలకు వివరిస్తానని ప్రధాని చెప్పారు.
మాస్కులు కట్టుకుందాం, రెండు గజాల సామాజిక దూరం పాటిద్దామని పిలుపునిచ్చిన మోడీ.. వైరస్ కట్టడికి అన్ని రాష్ట్రాల సూచనలను పరిగణనలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు.
అంతకుముందు, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని.. భారత పారిశ్రామిక రంగానికి ఇది మరింత దన్నుగా నిలబడుతుందన్నారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి దీని ద్వారా మరింత వూతం లభిస్తుందన్నారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది మరింత తోడ్పడుతుందన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకుని పోయేందుకు ఉపకరిస్తుందన్నారు.