షాకింగ్: భారత్‌కు పొంచి ఉన్న భారీ భూకంపం ముప్పు! ఎక్కడంటే…

himalayan-range-of-india
- Advertisement -

earth-quake-in-india

న్యూఢిల్లీ: భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందని, అక్కడ భారీ భూకంపం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధనా సంస్థకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఉత్తరాఖండ్ నుంచి నేపాల్ వరకు మధ్య ఉండే హిమాలయ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించే అవకాశాలున్నాయని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 వరకు ఉంటుందని వారు చెబుతున్నారు.

భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధనా సంస్థ, గూగుల్ ఎర్త్, ఇస్రో కార్టోశాట్-1 తీసిన చిత్రాల ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చామని, ఇదే ప్రాంతంలో క్రీ.శ 1315-1440 సంవత్సరాల మధ్య 8.5 తీవ్రతతతో భూకంపం సంభవించి భారీ విధ్వంసాన్ని సృష్టించిందని వారు పేర్కొంటున్నారు.

అప్పట్లో ఈ భూకంపం ధాటికి ఈ ప్రాంతంలో 600 కిలోమీటర్ల మేర పొడవైన పగులు ఏర్పడిందని.. ఇది మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి లక్నో వరకు ఉన్న దూరం కన్నా అధికమని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘‘ఆ స్వల్ప భూకంపం దీనికే సూచిక…’’

భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడం కారణంగా ఇప్పుడు మరోసారి అదే తరహా భూకంపం సంభవించే అవకాశాలున్నాయని.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం చోటు చేసుకుందని, త్వరలో సంభవించనున్న భారీ భూకంపానికి ఇదొక సూచిక అని భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు.

2015లో నేపాల్‌లో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2016లో పరిశోధనలు నిర్వహించారు.

మధ్య హిమాలయ ప్రాంతంలోని భూగర్భంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వస్తోందని.. దీని వల్ల భవిష్యత్తులో భారీ భూకంపం చోటుచేసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

 

- Advertisement -