హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లలో ఉంటున్న ఇతర ప్రాంత విద్యార్థులకు వారి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. విద్యార్థుల వివరాలను డీఈవోలకు పంపించాలని విద్యాశాఖ ఆదేశించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8 నుంచి జులై 5 వరకూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
షెడ్యూల్ ఇలా..
జూన్ 8న ఇంగ్లిష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లిష్ పేపర్-2, 14న మ్యాథ్స్ పేపర్-1, 17న మ్యాథ్స్ పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలు కాగా, మూడు పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వాయిదా వేసింది.
టెన్త్ పరీక్షలకు హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసినట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కోర్టుకు తెలిపారు.
8 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు మే 22న నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలుగా అన్ని వసతులున్న భవనాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలను 2,530 నుంచి 4,535కు పెంచామని, బెంచ్కు ఒకరు చొప్పున జిగ్జాగ్ పద్ధతిలో విద్యార్థులు కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. అన్ని కేంద్రాల వద్ద స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లౌజులు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.