డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అపశృతి: పదో అంతస్తు నుంచి పడి ఐదుగురు మృతి

double bedroom houses
- Advertisement -

double bedroom

మేడ్చల్‌: కీసర మండలం రాంపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వీటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు ప్రమాదవశాత్తు పదో అంతస్తు నుంచి జారిపడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడకక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు వదిలాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పశ్చిమబెంగాల్‌కు చెందిన యెషు కుమార్‌ చౌదరి(20), సుపాల్‌రాయ్‌(32), సైపుల్‌ హక్‌(26), అభిజిత్‌రాయ్‌(18), ఇలాన్‌ షేక్‌(20) అక్కడికక్కడే మృతిచెందగా.. విప్లవ్‌రాయ్‌ అనే క్షతగాత్రుడు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఐదుగురు కూలీల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుత్తేదారులు ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కూలీలు ఆరోపిస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని గుత్తేదారు హామీ ఇచ్చారు.

కార్మికుల మృతితో కూలీల ఆగ్రహం: ఫర్నీచర్ ధ్వంసం, ఉద్రిక్తత

అంతకుముందు ఒకేసారి ఐదుగురు కూలీలు మృతి చెందడంతో మిగతా కూలీలు ఆగ్రహంతో నిర్మాణ సంస్థ కార్యాలయంలో అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ పరిస్థితిని సమీక్షించారు.

- Advertisement -