- Advertisement -
హైదరాబాద్: సినీహీరో మహేశ్బాబుకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఓ ఛాలెంజ్ విసిరారు. ‘ఇగ్నైటింగ్ మైండ్’ సంస్థ ఆధ్వర్యంలో మూడు మొక్కలు నాటే ఛాలెంజ్ స్వీకరించిన మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి మూడు మొక్కలు నాటి మరో మూడు మొక్కలు నాటేందుకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్కు చాలెంజ్ విసరగా.. ఈ చాలెంజ్ను స్వీకరించిన ఆయన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్లో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆయన సినీహీరో మహేశ్బాబు, హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ సీపీ సుధీర్బాబులకు మొక్కలు నాటే చాలెంజ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా హయత్నగర్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ‘గ్రీన్ ఇండియా’ పేరుతో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాచకొండ పోలీసులు కూడా పాల్గొని మొక్కలు నాటుతున్నారని అన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణ, పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.
ఇగ్నైటింగ్ మైండ్ సంస్థ ఎండీ కరుణాకర్రెడ్డి, డైరెక్టర్ రాఘవ మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మాటలను ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమానికి స్వీకారం చుట్టామని అన్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియంకా వర్గీస్తో కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు.
ఒక వ్యక్తి నాటిన మూడు మొక్కలు సంవత్సరానికి 300 కిలోల ఆక్సిజన్ ఇస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో హయత్నగర్ సీఐ సతీష్, అబ్దుల్లాపూర్మెట్ సీఐ ముని, ఎస్ఐ ప్రభాకర్ పాల్గొన్నారు.
- Advertisement -