హైదరాబాద్: మేడ్చల్లో దారుణం జరిగింది. ఫేస్బుక్లో తనకు పరిచయమైన మహిళ మరో యువకుడితో సన్నిహితంగా ఉండడంతో జీర్ణించుకోలేక ఆమె ఐదేళ్ల కుమార్తెను దారుణంగా చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్లోని భవానీనగర్కు చెందిన కరుణాకర్కు అనూషతో మూడు నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.
మరోవైపు, ఆ మహిళ రాజశేఖర్ అనే యువకుడితోనూ సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలిసిన కరుణాకర్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిన్న మధ్యాహ్నం 12:30 సమయంలో అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికే రాజశేఖర్ ఆమె ఇంట్లో ఉన్నాడు.
కరుణాకర్ వస్తున్న సంగతి గమనించిన అనూష వెంటనే రాజశేఖర్ను బాత్రూంలో దాచింది. ఇది చూసిన కరుణాకర్ బయటకు రావాలని రాజశేఖర్ను కోరాడు. బయటకు రాకుంటే అనూష ఐదేళ్ల కుమార్తె ఆద్యను చంపేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ అతడు బయటకు రాకపోవడంతో ఆద్య గొంతు కోసేశాడు.
దీంతో చిన్నారి విలవిల్లాడుతూ అరుస్తుండడంతో రాజశేఖర్ బయటకు వచ్చాడు. అతడు బయటకు రాగానే అతడిపైనా కరుణాకర్ కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత కరుణాకర్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న రాజశేఖర్ పరుగులు తీస్తూ చిన్నారి తండ్రి కల్యాణ్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
మరోవైపు, ఈ పరిణామాలతో షాక్కు గురైన అనూష వెంటనే తేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె ఆద్యను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించింది. అయితే, చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించచారు. అనూష భర్త కల్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఘట్కేసర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.