హైదరాబాద్: హైదరాబాద్లో దారుణం జరిగింది. ఓ ఉద్యోగిని ఢీకొట్టిన కారు.. అతడిని ఏకంగా 5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. శంషాబాద్ విమనాశ్రయం సమీపంలో జరిగిన ఈ దారుణం అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎయిర్పోర్టు కార్గో విభాగంలో పనిచేస్తున్న యాదయ్య విధులు ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరాడు.
వర్షం భారీగా కురుస్తున్నా ఇంటికి చేరుకోవాలన్న తపనతో బైక్పై బయలుదేరిన యాదయ్యను ఓ క్యాబ్ ఢీకొట్టింది. యాదయ్య చొక్కా క్యాబ్కు చిక్కుకుంది. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ యాదయ్యను దాదాపు 5 కిలో మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు.
చివరకు కిషన్గూడ ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద యాదయ్య కిందపడ్డాడు. టోల్ గేట్ వద్ద యాదయ్యను గుర్తించిన క్యాబ్ డ్రైవర్ అతడు అప్పటికే చనిపోయినట్టు గుర్తించి అక్కడ పడేసి పరారయ్యాడు.
ఎయిర్పోర్ట్ రోడ్డులో యాదయ్య బైక్ను గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.