హైదరాబాద్ : కరోనా వైరస్ విషయంలో వచ్చే నాలుగైదు వారాలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా వైరస్ కమ్యూనిటీలోకి చొచ్చుకెళ్లిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉండబోతోందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ డీఎంఈ రమేష్రెడ్డి తెలిపారు.
అయితే, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత స్థితిని సామాజిక వ్యాప్తి అనలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో నిర్ధారిత కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రమేశ్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు.
కోర్టులో రోజుకో పిల్ వేయడం మంచి పరిణామం కాదని రమేష్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మెడికల్ సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికీ 6,500 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో చికిత్స జరుగుతోందని, అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ రావొద్దని రమేశ్ రెడ్డి కోరారు.