హైదరాబాద్: తెలంగాణలో ప్రజాప్రతినిధి ఒకరు కరోనా బారినపడ్డారు. జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ అనుమానంతో ముత్తిరెడ్డి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు వైద్యులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే కరోనా బారినపడడం ఇదే తొలిసారి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇటీవల కరోనా బారినపడినప్పటికీ కోలుకున్నారు.
కాగా, తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 164 కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు.
నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 133 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,484 కేసులు నమోదు కాగా, 174 మంది మరణించారు. 2,032 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.