ఫ్రెంచ్ గయానా: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు జీశాట్ -31 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది.
విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. జీశాట్ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. దీంతో నింగిలోకి ఇస్రో పంపిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల సంఖ్య 40కి చేరింది.
15 ఏళ్ల పాటు నిరాటంకంగా…
కాగా, 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలందించే సామర్థ్యం కల్గిన ఈ ఉపగ్రహం బరువు 2,535 కిలోలు. అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థ ఉన్న జీశాట్ -31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్శాట్, జీశాట్లకు ఆధునిక రూపమని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఈ ఉపగ్రహం వీశాట్ నెట్వర్క్స్, టెలివిజన్ అప్లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్ టెలివిజన్, సెల్యులార్ బ్యాకప్లకు అనుకూలమైన సాంకేతికత సొంతం చేసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలు అందిస్తుంది.
ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన ఈ ప్రయోగానికి ఇస్రో ప్రతినిధిగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరక్టర్ ఎస్ పాండ్యన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి లోపం తలెత్తకుండా ఈ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. ఐరోపాలోని ఫ్రెంచ్ గయానాతో భారత్కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయని చెప్పారు.
?? #ISROMissions ??
Here’s a lift-off video from @Arianespace.#GSAT31#Ariane5 (#VA247) pic.twitter.com/mHvltAXC1Y
— ISRO (@isro) February 6, 2019