ముంబై: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. ఈ ఏడాది మేలో ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్కు సంబంధించి భారత జట్టు ఎంపికపై సస్పెన్స్ వీడిపోయింది.
సోమవారం ఉదయం ముంబైలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్లో సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశానికి జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: ఎట్టకేలకు బోణీ కొట్టిన బెంగళూరు! రాణించిన కోహ్లీ, డివిల్లియర్స్…
సమావేశం అనంతరం.. మే 30న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ ట్రోఫీలో ఆడనున్న 15 మందితో కూడిన భారత జట్టును, ఆటగాళ్ల వివరాలను మీడియాకు విడుదల చేశారు.
రాయుడు, పంత్కు దక్కని చోటు…
తుది జట్టులో అంబటి రాయుడు, రిషభ్ పంత్కు చోటు దక్కలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో నంబర్ వన్గా ఉన్న భారత్ ఇప్పటివరకూ రెండుసార్లు వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. మూడోసారి కోహ్లీ సారథ్యంలో కప్ను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.
కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు. వీరితో పాటు ఎంఎస్ ధోనీని ప్రధాన కీపర్గా, సెకండరీ కీపర్గా దినేశ్ కార్తీక్ని జట్టులోకి తీసుకున్నారు. ఇక రిజర్వ్ ఓపెనర్గా కేఎల్ రాహుల్కి జట్టులో చోటు కల్పించారు.
చదవండి: ఎయిర్పోర్టులో నేలపైనే నిద్రపోయిన ధోనీ, సాక్షి! వైరల్ అవుతోన్న ఫోటో..
ప్రధాన పేసర్లగా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్లను తీసుకున్నారు.. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్లుగా జట్టులోకి తీసుకున్నారు.
వరల్డ్ కప్ కోసం ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పంపడానికి ఏప్రిల్ 23 ఆఖరి తేదీ. అయితే భారత జట్టు సెలక్టర్లు గడువు తేదీకి ఒక వారం ముందుగానే జట్టును ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే భారత తుది జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు కూడా మానసికంగా సిద్ధం కావడానికి.. వారికి తగిన సమయం ఇవ్వాలనుకోవడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు.
వరల్డ్ కప్ టీమిండియా జట్టు ఇదే…
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధోనీ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, చాహల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ
బ్యాట్స్మెన్: కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్
బౌలర్లు: బుమ్రా, షమీ, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్
ఆల్రౌండర్లు: కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్