ముంబై: ఐపీఎల్ స్పాన్సర్షిప్ విషయంలో ఉన్న ఉత్కంఠ వీడిపోయింది. ఐపీఎల్ 13వ సీజన్కు సంబంధించి స్పాన్సర్ షిప్ హక్కుల నుంచి వివో ఇటీవల తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, రూ. 250 కోట్లకు డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకుంది.
డ్రీమ్ 11తో పాటు అన్ అకాడమీ(రూ. 210 కోట్లు), టాటాసన్స్ (రూ. 180 కోట్లు), బైజూస్ (రూ. 125 కోట్ల)తో బిడ్ వేసి పోటీ పడగా, రూ. 250 కోట్లతో డ్రీమ్11 ఐపీఎల్ 2020కి సంబంధించి స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది.
2018-22 ఏళ్ల మధ్య ఐదేళ్ల కాలానికి గానూ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే గల్వాన్ ఘర్షణ అనంతరం చైనాకు చెందిన వస్తువులను బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తెలపడంతో చైనాకు చెందిన వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది.
దీంతో ఐపీఎల్ 2020కి సంబంధించి కొత్త స్పాన్సర్ ఎవరు వస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్పాన్సర్షిప్ హక్కుల కోసం రిలయన్స్ జియో, బైజూస్, టాటాసన్స్, అన్ అకాడమీ, డ్రీమ్ 11 వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి.
చివరకు 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 మూడు నెలల కాలానికి గానూ ఐపీఎల్ 2020 స్పాన్సర్షిప్ హక్కులను పొందింది.
డ్రీమ్ 11కు గతంలో 2018లో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు.
దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఐపీఎల్ ప్రాంచైజీలు రెడీ అవుతున్నాయి.