కడప: వైఎస్ వివేకానందరెడ్డి – జగన్ ఫ్యామిలీ మధ్య ఇంటర్నల్ వార్ ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు చేశారు. వివేకా మృతి వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వారు నిరూపించాలని సవాల్ విసిరారు.
ఎంపీ అవినాష్ రెడ్డి – వైఎస్సార్ ఫ్యామిలీ మధ్య వార్ ఉందని.. జగన్ రెడ్డిది ఒక కుటుంబం.. అవినాష్ రెడ్డిది మరో కుటుంబంగా ఉందన్నారు. విజయమ్మపై వివేకానందరెడ్డి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన పోటీ చేసిన సమయలో జగన్ ఆ సీటు కోసం పట్టుబట్టేవాడని.. ఇలా వారి మధ్య ఇంటర్నల్ వార్ ఉందన్నారు.
నిజ నిజాలు తెలుసుకోవాలి…
1999లోనే వైఎస్ వివేకా పార్లమెంట్కు పోటీ చేయాలని అనుకున్న సమయంలో.. వారి కుటుంబంలో గొడవలు జరిగాయని వివరించారు మంత్రి ఆది. 2009లో ఎమ్మెల్సీని చేశారని గుర్తు చేశారు. గతంలో వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పదవిపై నాకు, వివేకానందరెడ్డి మధ్య పోటీ ఉండేదని.. చివరకు నేనే సర్దుకుని ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయిన విషయం గుర్తు లేదా అని రవీంధ్రనాథ్ రెడ్డిని ప్రశ్నించారు.
వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ డీజీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు మంత్రి ఆది. వైసీపీ నేతలు ఇష్టానుసారం ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. జగన్ పై దాడి విషయంలో వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో అందరికీ తెలిసిందేన్నారు. నెపం మోపడం.. పబ్బం గడుపుకోవడం.. ప్రచారం చేసుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు.