చెన్నై: ఐపీఎల్ 12వ సీజన్లో పోరు కీలక దశకు చేరుకుంది. ఇక అసలు సిసలు సమరం ప్రారంభం కానుంది. ఆదివారం నాటితో లీగ్ మ్యాచ్లన్నీ ముగియగా ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే సీఎస్కేపై రెండుసార్లు నెగ్గిన ముంబై మళ్లీ ఆధిపత్యాన్ని కనబరుస్తూ నేరుగా ఫైనల్కు వెళ్తుందా.. లేక ధోనీ సేనే రెండు ఓటములకు ప్రతీకారం తీర్చుకుంటూ ముందుగా బెర్త్ దక్కించుకుంటుందా అనేది తేలుతుంది.
చెపాక్ మైదానంలో సీఎస్కేకు మంచి రికార్డు ఉంది. చివరి 20 మ్యాచ్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే ఓడింది. అయితే, ఆ రెండు సార్లు కూడా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. ఇక, ముంబై జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా, బౌలింగే ప్రధాన బలంగా చెన్నై బరిలోకి దిగుతోంది.
ఈ రోజు జరిగే మ్యాచ్లో ఓడిన జట్టు 10 జరిగే రెండో క్వాలిఫయర్లో తలపడుతుంది.
చెపాక్ స్టేడియంలో రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగ్గా, ముంబై 5సార్లు, చెన్నై 2 సార్లు నెగ్గాయి. కాగా, రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.