అమరావతి: మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలిసిపోతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో ఎక్కువ శాతం జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారం చేజిక్కించుకుంటుందని ప్రకటించాయి.
దీంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ పెరిగింది. ఇక అధికారం తమదే అని నేతలు మంత్రి వర్గం ఎలా ఉండాలనే దానిపై చర్చలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉంటారని చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గత అయిదేళ్లుగా వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి విజయసాయికి ఆర్థిక శాఖను అప్పగిస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది.
చదవండి: జగన్కి శరద్ పవార్ ఫోన్.. బీజేపీయేతర పక్షంలోకి ఆహ్వానం…
ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గాని, అంబటి రాంబాబు గాని ఇస్తారని అంటున్నారు. వీళ్లలో ఎవరోకరు గెలిచిన ఆ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. వీరు అయితేనే ప్రతిపక్షంలో ఉండే టీడీపీని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అలాగే పార్టీలో సీనియర్లుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తదితరులకు పదవులు దక్కవచ్చని చర్చ నడుస్తోంది. చూద్దాం మరి అసలు వైసీపీ అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ అధికారంలోకి వస్తుందో.