అమరావతి: ఏపీ చేపల నిషేధం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్కు లేఖ రాశారు. ఏపీ నుంచి చేపలు, రొయ్యల దిగుమతిపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ లేఖలో కోరారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్న చేపలు, రొయ్యల్లో ప్రమాదకరమైన ఫార్మాలిన్ అనే రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తనిఖీల్లో తేలడంతో బిహార్ ఏపీ సముద్ర ఉత్పత్తులపై గతంలో నిషేధం విధించింది. ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ.. తమ ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ వాడటం లేదని స్పష్టం చేశారు.
రొయ్యలు, చేపల ఉత్పత్తుల తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తనిఖీల కోసం బీహార్ నుంచి అధికారులను పంపాలని కోరారు. ఏపీ సముద్ర ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి, చేపలను, రొయ్యలను బీహార్లో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఆ 3 పార్టీలు కుట్రలు చేస్తున్నాయి: చంద్రబాబు
ఇది ఇలా ఉండగా, బీసీలపై కపట ప్రేమ చూపుతూ తమపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బీసీల్లో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోడీ డైరెక్షన్లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీలను టీడీపీకి దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.. ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. గతంలో వైఎస్ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిందించారని.. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై కేసీఆర్దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్ను పొగుడుతున్నారని విమర్శించారు.
ఏం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారానికొకరు రాష్ట్రానికి వస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. కోల్కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు.